
ఆంజనేయులు న్యూస్, పెద్దపెల్లి జిల్లా: ప్రమాదంలో గాయపడిన, చనిపోయిన బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు రోడ్లపై నిరసనల పేరుతో ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కల గూడూర్, పెద్దపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు నష్టపరిహారం కోసం కొంతమంది స్వార్థం, స్వలాభం పొందే వారి ప్రోద్బలంతో రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు ధర్నాలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి చర్యలతో సాధారణ ప్రజలు, వాహనదారులకి ఇబ్బంది కలుగుతుంది తప్ప సమస్యలు పరిష్కారం కావన్నారు. బాధితులకు ఏదైనా నష్టపరిహారం కావాలనుకుంటే చట్టపరంగా కోర్టుల ఆదేశాలు, నిర్ణయం ద్వారా పొందాలని సూచించారు. బాధితులను, వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులను ప్రలోభాలకు గురిచేసి ధర్నాలు రాస్తారోకోలు చేసేలా ప్రోత్సహించే వారి జాబితా సిద్ధం చేశామని, వారిపై త్వరలోనే చట్టమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.