భూసార పరీక్షలు రైతులకు మరింత ప్రయోజనకరమని, మట్టి ఆరోగ్యాన్ని కాపాడితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లేనని
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భూసార పరీక్షలు రైతులకు మరింత ప్రయోజనకరమని, మట్టి ఆరోగ్యాన్ని కాపాడితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లేనని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మృత్తికి (నేల) దినోత్సవం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి కల్పనతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మట్టిని ఆరోగ్యంగా ఉంచేందుకు రైతులు కృషి చేయాలని, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి శాస్త్రీయ పద్దతిలో సేంద్రియ ఎరువులను అధికంగా వినియోగించే విధంగా వ్యవసాయ సాగు చేయాలని తెలిపారు. రసాయన ఎరువుల వినియోగంతో వచ్చే పంట వలన అనేక వ్యాధులు వస్తున్నాయని, ఆరోగ్యకరమైన ఆహారం శాస్త్రీయ వ్యవసాయ సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా సాధ్యపడుతుందని తెలిపారు. రైతుల పంట మార్పిడి విధానం పాటించాలని, ఒకే రకమైన పంట సాగు చేస్తూ రసాయన ఎరువులు వాడటం వలన భూసారం తగ్గుతుందని, పంటలను ఎప్పటికప్పుడు మార్పులు చేయడం వలన మట్టికి, మనకు కూడా మంచిదని, మట్టి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. మట్టి సంరక్షణ ఎంతో ఆవశ్యకమని, నేలను రక్షించుకోవడం రైతులు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. పశువుల పేడ, జీవ ఎరువులు, పచ్చిరొట్ట ఇతరత్రా శాస్త్రీయ పద్దతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన పంట దిగుబడి పొంది ప్రజల ఆరోగ్యం కాపాడవచ్చని తెలిపారు. మట్టిలో పోషకాల మోతాదును తెలుసుకోవడానికి మట్టి పరీక్షలను చేయించాలని, నివేదిక ఆధారంగా ఎరువులను వినియోగించి ప్రజలకు పోషక విలువలతో కూడిన పంటను అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మార్గం రజిత, ఎ.ఈ.ఓ. ఎస్. కనుకరాజు, గుడిపేట, కర్ణమామిడి, ముల్కల్ల సర్పంచ్లు లగిశెట్టి లక్ష్మీ – రాజయ్య, కొట్టె మహేందర్, మంచాల శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.