డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి వచ్చే జనవరి 18న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి వచ్చే జనవరి 18న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆరోజున 6వ అంతస్తులోని సీఎం బ్లాకును ప్రారంభించి.. తన ఛాంబర్ లో కేసీఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ రోజు నుంచి అక్కడే ప్రభుత్వ కార్యకలాపాలు సాగనున్నాయి.
ఈ గడువులోగా పనులన్నీ పూర్తిచేసి సర్వాంగసుందరంగా సచివాలయాన్ని సిద్ధం చేయాలని ఆయన అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను సోమవారం ఆదేశించారని తెలిసింది. ఇటీవల సచివాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన సందర్భంగా.. పనులను వేగవంతం చేయాలని, సంక్రాంతి తర్వాత ప్రారంభోత్సవం ఉంటుందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. జనవరి 18న మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజునే ప్రారంభోత్సవం జరపాలని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది.