భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతించింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టేందుకు సంజయ్ వెళ్తుండగా ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. యాత్ర ప్రారంభోత్సవ సభ భైంసాకు 3 కి.మీ. దూరంలో ఉంటేనే అనుమతించాలని పోలీసులకు స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది రామచందర్రావు వాదనలు వినిపించారు. భైంసా పట్టణం మీదుగా పాదయాత్ర వెళ్లదని తెలుపుతూ రూటా మ్యాప్ వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు. పట్టణంలోని ప్రవేశించకుండా వై జంక్షన్ నుంచి మాత్రమే కొనసాగుతుందని వివరించారు. భైంసా పట్టణంలోకి పాదయాత్ర వెళ్లనపుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) స్పందిస్తూ.. ఆ ప్రాంతం చాలా సున్నితమైనదని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సంజయ్ పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.