పౌర హక్కులపై ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు, జిల్లా స్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలి.
మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పౌర హక్కులపై ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు, జిల్లా స్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, డి.సి.పి. అఖిల్ మహాజన్, స్పెషల్ పి.పి. కిరణ్ కుమార్ రెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవితో కలిసి ఎస్.సి. ఎస్.టి., అట్రాసిటీపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. అట్రాసిటీ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని, చట్టంపై ప్రజల్లో పూర్థి స్థాయి అవగాహన కల్పించాలని, ఎస్.సి.ఎస్.టి. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 440 కేసులు నమోదు కాగా 381 కేసులలో బాధితులకు ఇప్పటి వరకు 3 కోట్ల 75 లక్షల రూపాయల పరిహారం అందించడం జరిగిందని, 20 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నమోదు అయిన కేసులు పరిష్కరించడంతో పాటు పరిహారం సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో సివిల్ రైట్స్ డే సందర్భంగా నిర్వహించే సభలలో పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, అటవీ, ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యేలా చూడాలని, రాజస్వ మండల అధికారి ఈ మేరకు పర్యవేక్షించాలని, ఆయా మండలాల తహశిల్దార్ల సమన్వయంతో గ్రామసభల వివరాలు అందిరికీ తెలిసే విధంగా రెండు రోజుల ముందు నుండి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురపాలక సంఘాల పరిధిలో సివిల్ రైట్స్ డే సభలను నిర్వహించడం కమీషనర్లు బాధ్యతగా తీసుకోవాలని, ఈ సభలకు అందరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్రైమాసికంలో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు వేదికలకు సంబంధించిన వివరాలు కమిటీ సభ్యులకు, నాయకులకు తెలియజేయాలని అన్నారు. నమోదైన కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుపాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికార యంత్రాంగం మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కేసుల స్థితిగతులను పరిశీలించి తగు సూచనలు సలహాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, ఎ.సి.పి.లు తిరుపతిరెడ్డి, ఎడ్ల మహేష్, నరేందర్, మంచిర్యాల మున్సిపల్ కమీషనర్, కమిటీ సభ్యులు జిల్లపెల్లి వెంకటేష్, బచ్చల అంజయ్య, రేగుంట లింగయ్య సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.