Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 November 2022, 8:39 pm Posted by : Anjaneyulu Dega

పోడు భూముల పోరులో.. ప్రాణాలొదిలిన అటవీశాఖ అధికారి

ఆంజనేయులు న్యూస్, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం ఓ అధికారి ప్రాణాలు బలిగొంది. అటవీ భూములను కాపాడేందుకు ఎదురొడ్డిన అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు విధినిర్వహణలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. పోడుభూముల సాగుదారులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే తుదిశ్వాస విడిచారు.
వివరాల్లోకి వెళితే.. చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించేందుకు మంగళవారం ఉదయం పోడుభూములు సాగుదారులు యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై మూకుమ్మడిగా దాడికి యత్నించడంతో బెండాలపాడు అటవీశాఖ అధికారి రామారావు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మొక్కలు తొలగించవద్దని చెప్పే లోపే అక్కడే ఉన్న శ్రీనివాసరావుపై కత్తులు, గొడ్డళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే ఆయన్ను చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి అంబులెన్స్ లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచారు.