Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 November 2022, 9:27 pm Posted by : Anjaneyulu Dega

తొలిసారి భారమైన మనసుతో ప్రెస్ మీట్: సీఎం కేసీఆర్

భారత ప్రజాస్వామ్య జీవనాడిని భాజపా కలుషితం చేస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. భారత్ ను భాజపా ఆకలిరాజ్యంగా మార్చేసిందని విమర్శించారు.

ప్రజాస్వామ్య హననం దేశానికే ప్రమాదం సీఎం కేసీఆర్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భారత ప్రజాస్వామ్య జీవనాడిని భాజపా కలుషితం చేస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు.  ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడుతూ.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.

“తొలిసారి భారమైన మనసుతో, దుఃఖంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నా. ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారు. దేశంలో చాలా ఇబ్బందిక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్య హననం దేశానికే ప్రమాదం. చాలా బాధతో ఈ విషయాలు మాట్లాడుతున్నా. ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది. నిరుద్యోగం పెరిగింది, రూపాయి విలువ పడిపోయింది. దేశ పరిస్థితిని అనేక అంతర్జాతీయ సూచికలు తెలియజేస్తున్నాయి. భారత్ ను భాజపా ఆకలిరాజ్యంగా మార్చేసింది. భాజపా విభజన రాజకీయాలు చేస్తోంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సంయమనం అవసరం. చివరికి ఎన్నికల సంఘం కూడా విఫలమైందని ఆరోపించడం దారుణం. భాజపా చెప్పినట్టు చేస్తేనే ఎన్నికల సంఘం పనిచేసినట్లా? దుబ్బాకలో స్వల్ప తేడాతో ఓడిపోయాం, నాగార్జున సాగర్ లో గెలిచాం. గెలుపు ఓటములు సహజం.. దేన్నాయినా గంభీరంగా స్వీకరిచాలి. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి నన్ను కలిసినట్టు దుష్ప్రచారం చేశారు. నాపై విచ్చల విడిగా అసత్య ప్రచారాలు చేశారు. పోలింగ్ కంటే ముందు మాట్లాడితే మునుగోడులో లబ్ధికోసమేనని ప్రచారం చేస్తారని ఇప్పటి వరకు ఆగా” అని సీఎం కేసీఆర్ వివరించారు.

దేశంలో మరో ఉద్యమం చేస్తాం.?

“గత నెలలో రామచంద్ర భారతి హైదరాబాద్ వచ్చి చేసిన ప్రయత్నాన్ని ఎమ్మెల్యే నాకు చెప్పారు. విశ్వప్రయత్నం చేసి తాండూరు ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. వీడియో ఫుటేజీ 3గంటల పాటు ఉంది. ప్రజలు, కోర్టుల సౌకర్యం కోసం ముఖ్యమైన ఫుటేజ్ మాత్రమే చూపిస్తున్నాం. తెలంగాణ, దిల్లీ, ఏపీ, రాజస్థాన్ తో పాటు మిగతా ప్రభుత్వాలను కూల్చేస్తామని అన్నారు. ఇప్పటికే 8 ప్రభుత్వాలను కూల్చేశారు. వచ్చిన ముఠాలో ఒక్కో వ్యక్తికి.. 3 ఆధార్ కార్డులు, పాన్కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు ఉన్నాయి. నకిలీ ఆధార్ కార్డులు, పాస్పోర్టులు వీరికి ఎవరిచ్చారు. ఇలాంటి ముఠాలు దేశంలో 24 పనిచేస్తున్నాయట. మా స్కానర్ లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. ఈవీఎంలు ఉన్నంతవరకు భాజపాకు డోకా లేదని వాళ్లు చెబుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు భాజపా రూ.100 కోట్లు ఇస్తుందంటున్నారు. రూ. వేల కోట్లు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి. భాజపాలో చేరితే.. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరగవని భరోసా ఇస్తున్నారు. విపక్ష పార్టీలను కూల్చే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. దేశాన్ని సర్వనాశనం చేస్తామంటే ఎవరూ క్షమించరు. ఈ వ్యవహారాన్ని ఒక కేసు మాదిరిగా చూడవద్దని జడ్జీలను కోరుతున్నా. ఇది ఇలాగే కొనసాగితే శాంతిభద్రతకు విఘాతం కలుగుతుంది. జయప్రకాశ్ నారాయణ్ లాంటి ఉద్యమం తీసుకొస్తాం. రాజ్యాంగేతర శక్తుల వీరవిహారాన్ని అరికట్టకపోతే అందరికీ ప్రమాదం. ఈ వీడియో 3గంటల పాటు ఉంది. వీడియో ఫుటేజీ అన్ని రాష్ట్రాల డీజీపీలకు పంపిస్తున్నాం. మేం సేకరించిన ప్రతి ఆధారాన్ని కోర్టుకు సమర్పిస్తున్నాం” అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.