
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజలకు ఆహార భద్రత కల్పించడంపై అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర నరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజలకు, పాఠశాలలకు, వసతిగృహాలకు, అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందించడం అధికారులు బాధ్యతగా తీసుకోవాలని, ఆహార భద్రత చట్టం-2013పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. రాజన్వ మండల అధికారులు, తహశిల్దార్లు విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి సోషల్ ఆడిట్ చేయాలని, చౌకధరల దుకాణాలు తనిఖీ చేసి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని, విధులలో అలసత్వం వహిస్తే సంబంధిత విభాగాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు ప్రజలతో జవాబుదారితనంతో వ్యవహరించాలని తెలిపారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వకృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణావృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్.డి.ఓ.లు వేణు, శ్యామలాదేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.