అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్ కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ వెల్లడించింది.
ఆంజనేయులు న్యూస్: అమూల్ పాల ధరలు (Amul milk price) మరోసారి పెరిగాయి. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్ కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్ ఎండీ ఆర్ఎస్ సోధి తెలిపారు. తాజా పెంపుతో ప్రస్తుతం ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ ధర రూ. 61 ఉండగా.. శనివారం నుంచి దాని ధర 63కు చేరింది.
అమూల్ పాల ధరలు పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది మూడోసారి. ఆగస్టులో అన్ని రకాల పాలపై లీటర్ కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది. పాల ప్యాకేజీ, రవాణా, పశుగ్రాసం వ్యయాలను కారణంగా చూపుతూ అంతకుముందు మార్చిలో సైతం పాల ధరను రూ.2 చొప్పున పెంచింది. అమూల్ పాల ధరల పెంపుపై ముందుగానే ప్రకటన విడుదల చేస్తుంది. కానీ ఈసారి ధర పెంచిన తర్వాత పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది.