Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 October 2022, 10:02 pm Posted by : Anjaneyulu Dega

పార్టీ మారాలని బెదిరిస్తే.. వీపు విమానం మోతే: రేవంత్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యనేతలంతా ఈనెల 14వరకు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆంజనేయులు న్యూస్, చౌటుప్పల్: మునుగోడు నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడారు. “మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్లు సంతలో పశువుల్లా అమ్ముడు పోయారు. వారి వెంట మీరు ఉండరని అనుకుంటున్నా. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలోకి వెళ్లారు. అభివృద్ధి ఎలా జరుగుతుందో ఆయనకే తెలియాలి. ఓట్ల రూపంలో వారిని చిత్తుగా ఓడించాలి. చీర నేసే పనికూడా సిరిసిల్లకే పోతోంది.. ఈ విషయం ఇక్కడి పద్మశాలీ సోదరులు ఆలోచించాలి. పార్టీ మారాలని బెదిరిస్తే. వారు ఎంతటి వారైనా సరే వాళ్ల వీపు విమానం మోత మోగుతుంది. పేదల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు పెట్టుకుని నిర్ణయం తీసుకోండి. కాంగ్రెస్ కు అండగా నిలబడి కాంగ్రెస్ ను గెలిపించండి. నాలుగు ఉప ఎన్నికల్లో తెరాస, భాజపాలను గెలిపిస్తే మార్పు ఏమీ రాలేదు. మహిళలంటే కేసీఆర్ కు చిన్న చూపు. ఒక ఆడబిడ్డకు మునుగోడులో ఎమ్మెల్యే అవకాశం ఇవ్వండి. మీ ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇస్తే.. మీ సమస్యలపై కొట్లాడి మీ వైపు నిలుస్తుంది. ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టండి.. ఆడ బిడ్డల శక్తిని చూపించండి” అని రేవంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు