Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 October 2022, 3:33 pm Posted by : Anjaneyulu Dega

గాంధీ ప్రతి మాటా. ప్రతి అడుగూ ఆచరణీయం: సీఎం కేసీఆర్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి అందించిన సేవలు ప్రశంసనీయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆవరణలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. దేశానికి గాంధీజీ అందించిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారని సీఎం ప్రశంసించారు. కరోనా సమయంలో రోగులను మిగతా ఆస్పత్రుల్లో తిరస్కరించినా ఇక్కడికి తీసుకొచ్చి వారి ప్రాణాలను కాపాడారన్నారు. వసతులు లేకున్నా ప్రజలకు సేవ చేశారని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు.

ధ్యానముద్రలో ఉన్న ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గొప్ప విషయమని.. దీని ఏర్పాటు అంశంలో మంత్రి శ్రీనివాస్ కు చిరస్థాయి కీర్తి దక్కుతుందని చెప్పారు. గాంధీ పుట్టిన దేశంలో మనందరం జన్మించడం గొప్ప విషయం. బాపూజీ చూపిన అహింసా మార్గం శాశ్వతమైనది. మానవోత్తముడు, విశ్వమానవుడు మహాత్మాగాంధీ. కరుణ, ధైర్యంతో నిస్సహాయతను ఎదుర్కోవచ్చని ఆయన చాటారు.