Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 September 2022, 1:49 pm Posted by : Anjaneyulu Dega

గర్భస్రావాలపై సుప్రీంకోర్టు కీలకతీర్పు.?

పెళ్లితో సంబంధం లేదు

మహిళలందరికీ అబార్షన్ చేయించుకునే హక్కుంది..!

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: మహిళల గర్భస్రావాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. ఇందులో వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ‘వైవాహిక అత్యాచారాన్ని’ కూడా కోర్టు ప్రస్తావించింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘చట్టప్రకారం మహిళలందరికీ సురక్షితంగా గర్భస్రావం చేయించుకునే హక్కుంది. మహిళ వైవాహిక స్థితి కారణంగా ఆమెకు అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కు లేదని చెప్పలేం. మెడికల్‌ టర్మినేషన్ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం నిబంధల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్‌ చేయించుకునే హక్కుంది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అని వివక్ష చూపించడం నేరం.. రాజ్యంగం ఎదుట అది నిలవజాలదు. పెళ్లయిన వారిని 24 వారాల లోపు అబార్షన్‌కు అనుమతిస్తూ.. అవివాహితులను అనుమతించకపోవడం సరికాదు. ఇప్పుడు కాలం మారింది. చట్టం స్థిరంగా ఉండకూడదు. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయి’’ అని కోర్టు స్పష్టం చేసింది.