Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 25 September 2022, 11:57 am Posted by : anjudega

అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా వైద్యుడి మృతి

ఘటనాస్థలంలోనే సజీవ దహనమైన డాక్టర్

చికిత్స పొందుతూ ఆయన కుమారుడు, కుమార్తె మృతి

ఆంజనేయులు న్యూస్, రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంటలో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదం ఓ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో.. అక్కడే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో వైద్యుడితో పాటు ఆయన కుమార్తె, కుమారులు మృతిచెందారు. వైద్యుడు ఘటనాస్థలంలోనే సజీవ దహనం కాగా.. ఆయన పిల్లలిద్దరూ చికిత్స పొందుతూ చనిపోయారు. వివరాల్లోకి వెళితే: రేణిగుంట పట్టణం భగత్సింగ్ కాలనీలో డాక్టర్ రవిశంకర్ రెడ్డి కార్తీక పేరుతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబం ఆస్పత్రి నిర్వహిస్తున్న భవనంలోనే పై అంతస్తులో నివాసముంటోంది. ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసముంటున్న అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న తిరుపతి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

తొలుత స్థానికులు గమనించి వెంటనే రవిశంకర్ రెడ్డి భార్య, అత్తను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టం వైద్యుడి కుమారుడు భరత్ (12) కుమార్తె కార్తీక (15)లను పైఅంతస్తు నుంచి కిందికి దించారు. వాళ్లిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు కూడా మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.