Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 September 2022, 10:42 pm Posted by : anjudega

పోడు భూముల సర్వే పారదర్శకంగా నిర్వహించాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం – 2005 ప్రకారం పోడు వ్యవసాయ సాగు చేస్తున్న అర్హులైన రైతులకు పోడు భూమి పట్టా అందజేయడంలో చేపట్టే సర్వే పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ సింగరేణి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.

ఎఫ్.ఆర్.సి. కమిటీ, గ్రామపంచాయతీ బృందం సమన్వయంతో గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం సబ్ డివిజనల్ స్థాయికి, అక్కడి నుండి జిల్లా స్థాయికి చేరుతుందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్.బి.ఓ.లు ఎఫ్.ఆర్.సి. కమిటీ సభ్యులతో కలిసి దరఖాస్తులకు సంబంధించి భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అటవీ అధికారుల పాత్ర అధికంగా ఉంటుందని, సమాచారాన్ని ముందుస్తుగా అందించడం ద్వారా సర్వే సులభతరం అవుతుందని, ఆర్.ఓ.ఎఫ్.ఆర్.కు సంబంధించి గతంలో మంజూరు చేసిన పట్టాల వివరాలను సరిచూసుకోవాలని, ఇందు కొరకు ఎఫ్.ఆర్.సి. కమిటీ సభ్యులు, చుట్టుప్రక్కల రైతులను సమన్వయం చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల ప్రకారముగా ఆయా ప్రాంతాలలో ఉన్న భూములకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించాలని, నిర్ణీత ప్రొపార్మాలో క్షుణ్ణంగా సేకరించిన వివరాలను నమోదు చేసి ఎఫ్.ఆర్.సి. కమిటీకి అందించవలసి ఉంటుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రతి రోజు 10 దరఖాస్తులను పరిశీలించాలని, మండల అధికారుల సమన్వయంతో కార్యచరణ ప్రకారంగా పనులు నిర్వహించాలని తెలిపారు. సర్వేలో భాగంగా దరఖాస్తులలో పేర్కొన్న భూములకు హద్దుల వివరాలను స్పష్టంగా రాసుకోవాలని, ఆ సమాచారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయడంపై దృష్టి సారించాలని తెలిపారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం ప్రకారం నియమ, నిబంధనల మేరకు సర్వే పారదర్శకంగా నిర్వహించాలని, పరిశీలనలో దరఖాస్తుకు జతపరిచిన వాటితో పాటు సంబంధిత డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్.ఆర్.ఓ.లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.