Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 September 2022, 1:48 pm Posted by : Anjaneyulu Dega

మరుగుదొడ్డీ ఖాళీ లేదు! దేశ రాజధానికి రైలులో కిక్కిరిసి ప్రయాణం..

ఆంజనేయులు న్యూస్: హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ వెళ్లే దక్షిణ్ ఎక్స్ ప్రెస్ (12721) సాధారణ బోగీల్లో ప్రయాణికుల పరిస్థితి ఇది. కిక్కిరిసిన జనరల్ బోగీలో ఎక్కడా అడుగుపెట్టే స్థలం లేక పలువురు మరుగుదొడ్డిలోనే ప్రయాణం చేస్తున్నారు. ఒకరు కమోడ్ మీద కూర్చుని నిద్రపోతూ కనిపించారు. శని, ఆదివారాల్లో దక్షిణ్ ఎక్స్ ప్రెస్ లో ‘ఆంజనేయులు న్యూస్’ పరిశీలించగా దారుణమైన పరిస్థితులు కనిపించాయి.

దిల్లీ మార్గంలో ప్రయాణం చేసే కూలీలు, రిజర్వేషన్ దొరకని వారు ఎక్కువగా ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. ప్రతి రోజూ తీవ్ర రద్దీ ఉంటోంది. ఎలాగైనా గమ్యం చేరాలనే ఉద్దేశంతో ఒకరి మీద ఒకరు పడినట్టే కూర్చోవడం ఒక ఎత్తయితే.. కొందరు దిగువ సీటు కింద సైతం పడుకుని కనిపించారు. మరికొందరు ప్రమాదం అని తెలిసినా డోర్ లో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఇందులో మహిళల బోగీతో కలిసి సాధారణ బోగీలు 4 మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రయాణికులు మరుగుదొడ్డికి వెళ్లడం నరకప్రాయమే. ఇక రెంటికి వెళ్లాల్సి వస్తే చెప్పనలవి కాదు. మహిళలు మరుగుదొడ్డి కోసం చెప్పనలవి కాదు. మహిళలు మరుగుదొడ్డి కోసం వచ్చినప్పుడు మాత్రం అందరూ ఏదోలా బయటకు వచ్చి వారు ఉపయోగించుకున్నాక తిరిగి అందులోకే వెళ్లి కూర్చోవడం కనిపించింది. ఢిల్లీ మార్గంలో ప్రయాణించే దానాపూర్, విశాఖ వైపు వెళ్లే లింక్ ఎక్స్ ప్రెస్ లోనూ రాత్రిళ్లు ఇదే పరిస్థితి ఉంది.