
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రపంచ నిర్మాణంలో దేవ శిల్పి విశ్వకర్మ పాత్ర అనిర్వచనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ మహాయజ్ఞ మహోత్సవం కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.

విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రపంచ నిర్మాణంలో విశ్వకర్మ ఆలోచన, నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమైనదని అన్నారు. ప్రతి నిత్యం మనం వినియోగించే వస్తు సామాగ్రి, ఆభరణాలు ఇతరత్రా అన్నీ విశ్వకర్మ సృష్టి అని, స్వర్ణకారులు, శిల్పులు, వడ్రంగులు, కంసాలి ఇతరత్రా రంగాలలో విశ్వబ్రాహ్మణులు అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపు రామ్ ప్రకాష్ మాట్లాడుతూ దేవశిల్పి విరాట్ విశ్వకర్మ సంతతికి చెందిన విశ్వబ్రహ్మణులు సృష్టిలో లభ్యమయ్యే వనరులను వినియోగిస్తూ ప్రతి నిత్యం మనం ఉపయోగించే అనేక రకాల వస్తువులు, ఆభరణాలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్కుమార్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, జిల్లా విశ్వబ్రాహ్మణుల సంఘాల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.