Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 September 2022, 12:53 pm Posted by : Anjaneyulu Dega

అలా నలుగురు చనిపోవడం మామూలు విషయం కాదు: గవర్నర్ తమిళిసై

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ (కు.ని) చికిత్సలు వికటించి నలుగురు చనిపోవడమనేది మామూలు విషయం కాదని.. ఆమోదయోగ్యం కూడా కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని.. నివేదిక వచ్చాక పూర్తి కారణాలు తెలుస్తాయని చెప్పారు. నిమ్స్ బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో గవర్నర్ మాట్లాడారు.

నిమ్స్ లో జరిగే ట్రీట్మెంట్ పై బాధితులు సంతృప్తిగా ఉన్నారని గవర్నర్ చెప్పారు. బాధితులు ఆర్థిక సహాయం కోరుతున్నారని.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి అందేలా చూస్తానని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని.. ఎక్కువ ఆపరేషన్ లు చేయాలన్న టార్గెట్ తో ఇలా చేయొద్దని తమిళసై వ్యాఖ్యానించారు.

త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్.. ఇన్ఫెక్షన్ వల్లే ఈ ఘటన జరిగినట్లు ఓ డాక్టర్ గా తాను భావిస్తున్నట్లు చెప్పారు. కుటుంబ నియంత్రణ చికిత్సలు అంటే మరింత మంది ముందుకు వచ్చేలా చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని గవర్నర్ తెలిపారు.