Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 August 2022, 10:36 pm Posted by : Anjaneyulu Dega

సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి.

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

మంచిర్యాల జిల్లా: సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాలని ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించి నియంత్రణ దిశగా సంబధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సహాయ పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ స్థాయి నుండి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్లు, నివాస ప్రాంతాలు, రోడ్లపై నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మురుగు కాలువలలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించే విధంగా గ్రామపంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి రోజు ఇంటింటి నుండి తడి, పొడి చెత్తలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని తెలిపారు. గ్రామాలలో అంటువ్యాధులు వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. కరోనా రెండు డోసులు పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా వైద్యాధికారులు దృష్టి సారించాలని తెలిపారు.

క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చేపట్టిన క్రీడా ప్రాంగాణాల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని మండలానికి రెండు క్రీడా ప్రాంగాణాల చొప్పున కేటాయించడం జరిగిందని, సంబంధిత పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాల పరిధిలో నిర్మించిన వైకుంఠధామంలో నీరు, విద్యుత్ ఇతరత్రా పూర్తి సౌకర్యాలు కల్పించడం జరిగిందని, వాటిని వినియోగించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాలలో మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతువేదికలలో అందుబాటులో ఉంటూ రైతులకు పంట సాగులో అవసరమైన సలహాలు, సూచనలు అందించడంతో పాటు రైతులు రైతువేదికలను సద్వినియోగం చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.