Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 August 2022, 11:34 pm Posted by : Anjaneyulu Dega

రాజీ పడే ప్రసక్తే లేదు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో శాంతిభద్రతలు, గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

నగరంలో నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని, ఎవరికీ ఎలాంటి సమస్యలు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని.. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది.