Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 August 2022, 11:03 pm Posted by : Anjaneyulu Dega

ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల ఖరారు..

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కాలేజీల్లో 45 కోర్సుల్లో 65,633 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండనున్నాయి. జేఎన్టీయూహెచ్, ఓయూ, కేయూ అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. అత్యధికంగా సీఎస్ఈలో 17,154, ఈసీఈలో 11,375, సీఎస్ఈ ఏఐఎంఎల్ 7,032 సీట్లకు యూనివర్సిటీలు అనుమతిచ్చాయి. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే కాలేజీలు, సీట్లు పెరగకపోయినప్పటికీ… పలు కాలేజీలు సివిల్, మెకానికల్, ట్రిపుల్ వంటి డిమాండ్ తక్కువ ఉన్న సీట్లను వెనక్కి ఇచ్చి సీఎస్ఈ, ఏఈఎంల్, ఐటీ వంటి కోర్సుల్లో పెంచుకున్నాయి. కన్వీనర్ కోటాలో 70శాతం, యాజమాన్య కోటాలో 30శాతం సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ లో భాగంగా ఇవాళ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు 8,409 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.

పెరగనున్న ఫీజులు..
పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెరగనున్నాయి. 14 ఇంజినీరింగ్ కాలేజీలు అంగీకరించిన ఫీజుల వసూలుకు అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫీజుల వసూలు తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఫీజులను సమీక్షించిన ఏఎస్ఆర్సీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, ఏఎన్ఆర్సీ నివేదికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఫీజులపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభించారని కాలేజీ యాజమాన్యాలు కోర్టు దృష్టికి తెచ్చాయి.