Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 August 2022, 10:02 pm Posted by : Anjaneyulu Dega

కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్ ప్రయత్నం: బండి సంజయ్

జనగామ జిల్లా: తెలంగాణలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. జనగామ జిల్లా ఖిలాషాపూర్ లో శనివారం ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న బండి.. రాష్ట్రంలో చీకట్లు అలుముకునే ప్రమాదం ఉందన్నారు. అందుకే ఎక్స్ఛేంజీలో విద్యుత్ విక్రయాలు ఆపేశామని పేర్కొన్నారు..

డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. డిస్కమ్ లు కట్టాల్సిన బకాయిలు రూ.20వేల కోట్లకు పైగా ఉండగా.. కేవలం రూ.1380 కోట్లు మాత్రమే కట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని బండి పేర్కొన్నారు. కేవలం రూ.50 కోట్లే కట్టాల్సి ఉందంటూ ఓ అధికారి పెనాల్టీ గురించి మాత్రమే చెబుతున్నారన్నారు. రాష్ట్ర మంత్రేమో అసలు డబ్బులే కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారని బండి సంజయ్ అన్నారు. దీని పేరు చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచాలని కేసీఆర్ చూస్తున్నారని బండి ఆరోపణలు చేశారు.