Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 August 2022, 9:44 pm Posted by : anjudega

భాజపా తెరాస కార్యకర్తల ఘర్షణ..!

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

జనగామ జిల్లా: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి పాదయాత్ర ప్రవేశించడంతో స్థానిక భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆ పార్టీకి చెందిన యువకులు బాణసంచా కాలుస్తూ సంజయ్ ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతుండగా భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.

పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది తెరాస కార్యకర్తలు.. భాజపా కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని తెరాస కార్యకర్తలు నిలదీశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కొంతమందికి గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు..