Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 August 2022, 9:54 am Posted by : Anjaneyulu Dega

ఎస్సై పరీక్షలో 8 ప్రశ్నల తొలగింపు..

ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని నిర్ణయం.. కీ విడుదల

52 మార్కులు వస్తే గట్టెక్కినట్లే

అభ్యంతరాలపై 15 వరకు చెప్పొచ్చు..

హైదరాబాద్: ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లాయి. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఆధ్వర్యంలో 554 పోస్టులకు ఈ నెల 7న నిర్వహించిన పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేశారు.. ఈ సందర్భంగా తప్పుల విషయం వెల్లడైంది. ఇంగ్లీష్ తెలుగు వెర్షన్ లొనీ ‘ఏ’ బుక్ లెట్ లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులను (30%) అర్హతగా నిర్ణయించిన సంగతి విదితమే. తాజా నిర్ణయం నేపథ్యంలో 52 మార్కులొచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో గట్టెక్కినట్లే. ఆయా అభ్యర్థులు తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించినట్లవుతుంది. మరో ఆరు ప్రశ్నలకు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ‘ఎ’ బుక్ లెట్ లో 54వ ప్రశ్నకు 3 సరైన సమాధానాలుండగా.. 114, 183, 186, 192, 197 ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలున్నాయి. వీటిలో దేనికి బబ్లింగ్ చేసినా మార్కులిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకటికంటే ఎక్కువ సమాధానాలున్న ప్రశ్నలకు సైతం మార్కులు కలపాలనే వాదన వినిపిస్తోంది. ‘తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులున్నందున పలువురు అభ్యర్థులు వాటిని వదిలేసే అవకాశముంది. దీంతో బహుళ సమాధానాలున్న ప్రశ్నలకూ మార్కులు కలపాలి’ అని అక్షర సర్కిల్ నిర్వాహకుడు విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు.

అభ్యంతరాలపై 15 వరకు చెప్పొచ్చు..

పరీక్ష ‘కీ’ని www.tslprb.in వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు మండలి ఛైర్మన్ వి. వి. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. కీపై అభ్యంతరాలుంటే వాటిని.. వెబ్సైట్ లో పొందుపరచిన ప్రత్యేక నమూనాపత్రం ద్వారా ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ తెలపవచ్చని వెల్లడించారు. ప్రతి ప్రశ్నను వేరువేరుగా సమర్పించాలని, సంబంధిత ధ్రువపత్రాలను జతచేయాలని ఛైర్మన్ స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని, వ్యక్తిగతంగా ఇచ్చే అభ్యర్థనలను స్వీకరించబోమని వెల్లడించారు..