
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: స్వాతంత్ర ఉద్యమంలో చేనేత వస్త్రధారణ ప్రధాన భూమిక పోషించిందని, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ భారతి హెూళ్ళికేరి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం రోజున జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ఆదరించాలని, వీలైనంతవరకు చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ రాట్నంపై నూలు వడికేవారని, అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను ఘనంగా నన్మానించారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని మండలాల వారిగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.