Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 06 August 2022, 9:21 pm Posted by : Anjaneyulu Dega

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ చిత్రం ప్రదర్శించాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల జిల్లా: ఆజాది కా అమృత్ మహోత్సవ్ – 75 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో గాంధీ చిత్రం ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ సినిమా థియేటర్ల యజమానులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలలో దేశభక్తి పెంపొందించేలా, స్వాతంత్ర్యం సాధించడంలో దేశభక్తులు చేసిన వీరోచిత పోరాటాలు, చేసిన త్యాగాల వివరాలు తెలియజేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో మొదటి విడత, 16 నుండి 21 తేదీలలో రెండవ విడతలలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గం॥ల వరకు 6 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గాంధీ చిత్రం ప్రదర్శించాలని తెలిపారు. పాఠశాలల నుండి థియేటర్ వరకు విద్యార్థినీ, విద్యార్థులను తీసుకువచ్చి చిత్ర ప్రదర్శన అనంతరం తిరిగి పాఠశాలకు తీసుకువెళ్ళడం జరుగుతుందని తెలిపారు. థియేటర్లలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా థియేటర్ల యజమానులు, నిర్వాహకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.