Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 August 2022, 11:13 pm Posted by : anjudega

భాజపాలో చేరేది వీరే: ఈటల రాజేందర్

హైదరాబాద్: తెరాస సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఉద్యమకారులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, తెరాస నుంచి పెద్ద ఎత్తున భాజపాలో చేరికలు ఉంటాయన్నారు. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్ పాటు మరికొంత మంది కాషాయ తీర్థం పుచ్చుకునే ఆస్కారం ఉందని తెలిపారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల వ్యవస్థ గొప్పగా ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ వందల సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. తిండిలేక, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు కేసీఆర్ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మనమడిని వారం రోజుల పాటు సంక్షేమ హాస్టల్లో ఉంచితే విద్యార్థులు పడే బాధ అర్థమవుతుందన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు తీర్చాలని ఈటల డిమాండ్ చేశారు.