Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 August 2022, 4:06 pm Posted by : Anjaneyulu Dega

జర్నలిస్టులు.. ప్రజలకు కళ్లు, చెవులు..!

వాస్తవాలు చెప్పడం మీడియా బాధ్యత

లా చదవక ముందు జర్నలిస్టుగా పనిచేశా

భగవద్గీత కాలానికీ మతానికీ అతీతమైనది.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ: జర్నలిజం స్వతంత్రంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజస్థాన్ పత్రిక అధినేత గులాబ్ చంద్ కొఠారి రచించిన గీతా విజ్ఞాన ఉపనిషత్తు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఇక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రమణ మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు కళ్లు, చెవుల్లాంటివారని తెలిపారు. మీడియా సంస్థలు వాస్తవాలు చెప్పడం తమ బాధ్యతగా భావించాలని, నిజాయితీని పాటించాలని హితవు పలికారు. తరచూ వ్యాపార ప్రయోజనాల వల్ల స్వతంత్ర జర్నలిజం స్ఫూర్తి దెబ్బతింటుందని, దాని ఫలితంగా ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. తాను లా చదు వుకునే ముందు కొద్దిరోజులు జర్నలిస్టుగా పని చేశానని, వార్తల సేకరణకు బస్సులో ప్రయాణించానని ఆయన చెప్పారు.

మన ఆధ్యాత్మిక గ్రంథాలు మానవ విలువలను ప్రబోధిస్తాయని చెప్పారు. భగవద్గీత బోధనలు మతానికి, కాలానికి అతీతమైనవని, అందులో అపారమైన విజ్ఞానమున్నదని, ప్రతి అధ్యాయమూ మనకు మార్గదర్శనం చేస్తుందని తెలిపారు. అందుకే గాంధీతో పాటు ఎందరో భగ వద్గీతకు ప్రేరేపితులయ్యారని గుర్తు చేశారు. నేటి యువత పుస్తకాలను చదవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శరీరానికి వ్యాయమం ఎంత ముఖ్యమో మెదడుకు అధ్యయనం అంత ముఖ్యమని స్పష్టం చేశారు