Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 August 2022, 3:24 pm Posted by : Anjaneyulu Dega

పవర్ ప్లాంట్ లో జైపూర్ యువతకే పెద్దపీట వేయాలి

మందమర్రి, రామకృష్ణాపూర్ లో మిగిలిన వారికి పట్టాలు. బ్రిడ్జిలకు నిధులు ఇవ్వండి

సింగరేణి డైరెక్టర్ (పా) బలరామ్ ని కోరిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా: తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి సంస్థ భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. సోమవారం సింగరేణి డైరెక్టర్ (పా) బలరామ్, క్యాతన్ పల్లిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న సింగరేణి సమస్యలపై విప్ ఆయనతో చర్చించారు. సింగరేణి ప్రాంతమైన మందమర్రి, రామకృష్ణాపూర్ లో పట్టాలు పంపిణీ చేశామన్నారు. అయితే ఆర్కె 4గడ్డ, శాంతినగర్, వల్లభాయి నగర్, నాగార్జున కాలనీ, ప్రగతి కాలనీ, రాజీవ్ నగర్, ఠాగూర్ నగర్, రామ్ నగర్, భగత్ సింగ్ నగర్, గంగాకాలనీ, సూపర్ బజార్ ఏరియా, దుర్గా రావు మార్కెట్, గీతా మందిర్ ఏరియా లో మిస్సయిన ఇండ్ల తో పాటు సింగరేణి క్వార్టర్ల మధ్య నివాసం ఉంటున్న వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారికి సైతం పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో 1600 పైగా సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉంటున్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రిటైర్డ్ కార్మికులు, పేద వారికి వాటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, అవి వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని బాల్క సుమన్ డైరెక్టర్ బలరామ్ ను కోరారు.

ఇక జైపూర్ పవర్ ప్లాంట్ లో ప్రస్తుతం 800 మెగావాట్ల విస్తరణ పనులు సాగుతున్నాయని అందులో ఉద్యోగాలకు సంబంధించి జైపూర్ లోని యువతకే పెద్దపీట వేయాలని విప్ సుమన్ కోరారు. ఇక మందమర్రి నుంచి రామకృష్ణాపూర్ వెళ్లే దారిలో పాలవాగుపై రూ. 7 కోట్లతో హైలెవల్ బ్రిడ్జితో పాటు, పెగడపల్లి వద్ద ఈదుల వాగు కోసం రూ.3.80 కోట్లు అందించాలని సింగరేణి డైరెక్టర్ బలరామ్ ను విప్ బాల్క సుమన్ కోరారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తదితరులు ఉన్నారు.