
నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కిరోసిన్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే. సోన్ మండలంలోని సంగంపేట్ గ్రామానికి చెందిన గొర్రె లింగన్న అనే వ్యక్తికి చెందిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామ వీడీసీ సభ్యులు కక్ష సాధింపు చర్యలు చేపట్టి భూమి చుట్టూ ట్రెండు ఏర్పాటు చేసి దారి వేశారని ఆరోపించారు. ఈ విషయమై గత నాలుగు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో అదనపు కలెక్టర్ రాంబాబును కలిసి సమస్యను విన్నవించారు. అధికారుల నుండి స్పందన రాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.