
హైదరాబాద్: వసతి గృహంపై నుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….. వనపర్తి పట్టణానికి చెందిన రమ్య (21), ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి శోభన్ రెడీమిక్స్ వాహనం డ్రైవర్. కుటుంబం ఉప్పల్ లో నివాసముంటున్నారు. అక్కడి నుంచి కళాశాల దూరంగా ఉండటంతో కొంత కాలంగా బీఎన్ రెడ్డినగర్ లోని లక్ష్మీ దుర్గా ఉమెన్స్ వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తోంది.
శనివారం రాత్రి హాస్టల్ రెండో అంతస్తుపైన ఉన్న రెయిలింగ్ పై కూర్చుని స్నేహితులతో మాట్లాడుతోంది. ఒక్కసారిగా అదుపుతప్పి వెనక్కు పడిపోయింది. తలకు తీవ్ర గాయాలవడంతో స్థానిక అమ్మ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.