Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 July 2022, 1:51 pm Posted by : Anjaneyulu Dega

వరద బాధిత కుటుంబాలకు రూ.10వేల తక్షణ సాయం: కేసీఆర్

భద్రాచలం: భారీ వర్షాల దృష్ట్యా నెలాఖరు వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో వంతెన పైనుంచి గోదావరి ఉద్ధృతిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు పునరావాస కేంద్రాలను కొనసాగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10వేల ఆర్థికసాయం, 20కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు..

సింగరేణి, ప్రభుత్వం కలిపి రూ. వెయ్యికోట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. గోదావరికి 90 అడుగుల వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. ఎత్తైన ప్రాంతంలో కాలనీ నిర్మాణానికి సీఎస్ చర్యలు తీసుకుంటారన్నారు. వరద పరిస్థితుల ముప్పు తర్వాత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని.. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని.. తదుపరి పర్యటనలో దీనిపై |పర్యవేక్షిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు.