Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 July 2022, 10:30 pm Posted by : Anjaneyulu Dega

పారిశుద్ధ్య చర్యలు త్వరగా పూర్తి చేయాలి..!

మాతా, శిశు కేంద్రంను సందర్శించిన జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల జిల్లా: భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన జిల్లా కేంద్రంలోని మాతా, శిశు కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా, చెదారంను త్వరితగతిన తొలగింపు చర్యలు చేపట్టి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మాతా, శిశు కేంద్రంను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరద కారణంగా దెబ్బతిన్న ఆనుషత్రి పరికరాలకు అవసరమైన మరమ్మత్తులు చేయించాలని, ఆయా వార్డులు, ఆసుపత్రి పరిసరాలలో పేరుకుపోయిన చెత్తా, చెదారంను యుద్ధప్రాతిపదికన తొలగించి రోగులకు సేవలు అందించేందుకు సిద్దం చేయాలని తెలిపారు.

అనంతరం మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి మంచిర్యాల పట్టణంలోని ఎన్.టి.ఆర్. నగర్ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడుతూ ముంపు గురైన బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. వరద కారణంగా వార్డులో పేరుకుపోయిన పూడిక, చెత్తా, చెదారాన్ని వెంటనే తొలగించాలని, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, ట్యాంకర్ల ద్వారా ప్రజలకు త్రాగునీటిని అందించడంతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మండల తహశిల్దార్ రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.