Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 July 2022, 9:32 pm Posted by : Anjaneyulu Dega

బాధితులు అధైర్య పడవద్దు, ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం.?

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల జిల్లా: జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపు గురైన వారిని బాధితులు అధైర్య పడవద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ముంపు కాలనీలైన రాంనగర్ ఏరియాలో మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్యతో కలిసి సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అధైర్య పడవద్దని, అన్ని విధాలుగా ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని తెలిపారు. రెండు రోజులు వరద నీటిలో తమ ఇళ్లు మునిగి పోవడంతో, చెత్తా చెదారం, బురద పేరుకుపోయి దుర్వాసన వస్తుందని, విద్యుత్ సరఫరా లేకపోవడం, బోర్ నీరు, త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు విన్నవించగా పురపాలక సంఘం త్రాగునీటి కొరకు ట్యాంకర్లు పంపించడం జరుగుతుందని, రోడ్లు, మురుగుకాలువలలో పేరుకుపోయిన చెత్తా, చెదారం, పూడికను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకుంటామని, విద్యుత్ సరఫరాను పునఃరుద్దరిస్తామని తెలిపారు.ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ సాధ్యం కాదని, ముందస్తు జాగ్రత్త చర్యలతో చాలా మేరకు ప్రజలను రక్షించగలిగామని, నిరాశ్రయులకు పురనావాసం కల్పించి ఆహారం, త్రాగునీరు అందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో జన్నారం మొదలుకొని కోటపల్లి వరకు చాలా గ్రామాలు పాక్షికంగా వరద ముంపుకు గురయ్యాయని తెలిపారు. బాధితులకు అండగా ప్రభుత్వ శాఖలు పని చేస్తాయని, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున వరద ముంపు గురైన ప్రాంతాలలో వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశంచారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల తహశిల్దార్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.