Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 July 2022, 8:42 am Posted by : anjudega

పుతిన్ కు మోదీ ఫోన్.. ఏం చర్చించారంటే?

దిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్లో సంభాషించారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపైనా ఇద్దరు నేతలూ తమ ఆలోచనలు పంచుకున్నారు. గతేడాది డిసెంబర్లో పుతిన్ భారత్లో పర్యటించిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేకించి వ్యవసాయ వస్తువులు, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా ప్రోత్సహించే అంశంపై పరస్పరం చర్చించుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ వ్యవహారాలతో పాటు అంతర్జాతీయ అణు, ఆహార మార్కెట్లో పరిస్థితిపైనా మాట్లాడుకున్నారని పేర్కొంది..

రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ లో కొనసాగుతున్న పరిస్థితిపై భారత్ దీర్ఘకాలంగా చెబుతోన్న పరస్పర చర్చలు, దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలన్న వైఖరినే ప్రధాని పునరుద్ఘాటించారని పీఎంవో తెలిపింది. అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని ఇరువురు నేతలూ అంగీకరించారని పీఎంవో పేర్కొంది..