Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 July 2022, 10:01 pm Posted by : Anjaneyulu Dega

ప్లాస్టిక్ పై నిషేధం.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష

దిల్లీ: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై నేటి నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి రూ. లక్ష వరకు జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకుండా వాటికున్న ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించేందుకు దిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో ఓ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. “ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్పై నేటి నుంచి నిషేధం ఉంది. ఈ నిషేధం పక్కాగా అమలు చేయడంలో భాగంగా దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ దిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. ఇందులో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే జులై 10 వరకు వార్నింగ్ నోటీసులు జారీ చేస్తాం. కానీ, ఆ తర్వాత కూడా సింగిల్ యూజ్ ప్లాస్టికన్ ను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి వారిపై రూ. లక్ష వరకు జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నాం” అని తెలిపారు..