
సిద్ధిపేట జిల్లా: కలుషిత ఆహారం తిని 128 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిద్ధిపేటలోని ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో మొత్తం 326మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయలో కలిపి వడ్డించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయాన్నే నిర్వాహకులు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన చేరుకొని అక్కడే చికిత్స ప్రారంభించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలంగాణ మైనారిటీ గురుకులాల సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూసఫ్ అలీ, జిల్లా విజిలెన్స్ అధికారి గౌస్ పాషా, మైనారిటీ గురుకులాల జిల్లా ఇన్ఛార్జి గోపాల్ రావు అడిగి తెలుసుకున్నారు…
ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సంబంధిత నివేదికను మైనారిటీ గురుకులాల రాష్ట్ర అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.