Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 25 June 2022, 11:39 am Posted by : Anjaneyulu Dega

జాతీయ పార్టీ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!

రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే కొత్త జాతీయ పార్టీ: సీఎం కేసీఆర్

అప్పటివరకు వివిధ వర్గాలతో చర్చలు

హైదరాబాద్: కొత్త జాతీయ పార్టీని రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయాలని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నెలలోనే పార్టీ ప్రారంభించాలని భావించినా రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇది అనుకూల సమయం కాదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలకు మూడు వారాలకుపైగా గడువు ఉన్నందున అప్పటి వరకు కొత్త పార్టీకి సంబంధించిన కసరత్తు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న  ప్రగతిభవన్ లో శాసనసభాపతి, మండలి ఛైర్మన్, మంత్రులు, పార్టీ లోక్సభ, రాజ్యసభ పక్ష నేతలు, శాసనసభ, మండలి పార్టీ విప్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. కొత్త జాతీయ పార్టీ ఆలోచన గురించి చెప్పారు. ఈ నెల 19న తెరాస కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు. దీనికి అనుగుణంగా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైతం సంప్రదించారు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలే ప్రధానాంశంగా ఉన్నందున కొత్త జాతీయ పార్టీని తర్వాత ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తామని ఎన్సీపీ అధినేత శరధ్పవర్ హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో చర్చించి, మద్దతుపై నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారు..