Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 May 2022, 5:06 pm Posted by : Anjaneyulu Dega

నా హత్యకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారు: మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: రెడ్ల సింహగర్జన సభలో తనపై దాడి చేసేందుకు కుట్ర చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనను హత్య చేసేందుకు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస సంక్షేమ పథకాలు రెడ్లకు అందుతున్నాయని సభలో చెప్పానన్నారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడతామన్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మల్లారెడ్డి వివరించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ శివారులో ఆదివారం సాయంత్రం రెడ్ల సింహగర్జన మహాసభ జరిగింది. దీనికి హాజరైన మంత్రి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుండగా, వెంబడించి.. ఆయన వాహనశ్రేణిపై కుర్చీలు, చెప్పులు విసిరారు. అప్రమత్తతతో వ్యవహరించిన పోలీసులు ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.