Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 May 2022, 5:53 pm Posted by : Anjaneyulu Dega

నేడు పది పరీక్షలు ప్రారంభం….. ఏర్పాట్లు పూర్తి

రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం:పది పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి.23నుంచి 28వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం కేశంపేట మండలంలోని 3 పరిక్ష కేంద్రాలలో ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. జడ్పిహెచ్ఎస్ కేశంపేట 240, విశిష్ట విద్యాలయం 150, జడ్పిహెచ్ఎస్ కొత్తపేటలో 236 మొత్తం 626మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12:45వరకు పరీక్ష ఉంటుంది.కరోన కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేశారు.ఈసంవత్సరం కూడా క్లాసులు సరిగ్గా జరగనందున సిలబసును 70 శాతానికి కుదించారు.పేపర్ల సంఖ్యను కూడా 11నుంచి ఆరుకు  తగ్గించారు.అయినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా అడపాదడపా చదువుతో పదిలో అడుగు పెట్టి అవాంతరాలను అధిగమిస్తూ విద్యానభ్యసించిన ఈసవత్సరం పదవ తరగతి విద్యార్థులు పరీక్షలలో ఏస్థాయి గ్రేడులు సాధిస్తారో ఫలితాలు వెలువడే వరకు వేచిచూడాల్సిందే.

కోవిడ్ నిబంధనలు:-

కోవిడ్ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఇఓ మనోహర్ తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రo వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల,ఇన్విజిలేటర్స్ ల వద్ద సెల్ ఫోన్ లు గాని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నా, పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని వివరించారు. విద్యార్థులు నిర్ణయించిన సమయం కంటే ముందే తమ తమ పరిక్ష  కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.