Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 May 2022, 11:00 am Posted by : Anjaneyulu Dega

రేపటి నుంచి పది పరీక్షలు.. ఆలస్యమైతే అనుమతించరు!

విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు..?

హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 23 నుంచి జూన్ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు వారి కేంద్రాలకు చేరుకోవాలి. 9.35 తరువాత అంటే 5 నిమిషాలు దాటితే లోపలకు అనుమతించబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో 5,09,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 75,083 మంది హాజరుకానున్నారు. విద్యార్థులందరూ కరోనా నిబంధనల మేరకు మాస్క్ ధరించాలి. హాల్టికెట్లు వెబ్సైట్ల లో అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. కరోనా కారణంగా ఎన్సీఈఆర్టీ సూచనల మేరకు పరీక్ష పేపర్ల సంఖ్యను 11 నుంచి 6కు తగ్గించినట్లు విద్యాశాఖ పేర్కొంది. ప్రశ్నపత్రంలో ఛాయిస్ ఎక్కువగా ఇవ్వనున్నామని, విద్యార్థులు చదివిన పాఠశాలలకు దగ్గర్లో పరీక్ష కేంద్రాలు కేటాయించామని వెల్లడించింది. జనరల్ సైన్స్లో భాగంగా భౌతిక, జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు వేరుగా ఇస్తామంది.

ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు, రాష్ట్రవ్యాప్తంగా 144 స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. వేసవి కారణంగా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎం, ఆశా ఉద్యోగి అవసరమైన మందులతో సిద్ధంగా ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతుందని, పరీక్ష పూర్తయ్యేవరకు జిరాక్సు కేంద్రాలు మూసివేస్తామని పాఠశాల విద్యాశాఖ వివరించింది.