Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 May 2022, 8:32 am Posted by : anjudega

ఇంటర్ బోర్డు కీలక ప్రకటన..!

తెలంగాణ:  ఇంటర్ ఫలితాలను నెలరోజుల్లోనే వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. మొత్తం 15 కేంద్రాల్లో 15 వేల మంది అధ్యాపకులతో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్ ప్రధాన పరీక్షలు విజయవంతంగా ముగిశాయని, 9.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వెల్లడించారు. కొన్నిచోట్ల మాత్రమే చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నల్లో ప్రింటింగ్ తప్పిదాలు వచ్చాయని, వచ్చే ఏడాది అవి రిపీట్ కాకుండా చూస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు అపోహలను నమ్మొద్దని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 9333కి కాల్ చేయాలని సూచించారు.

ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న 12 మందిని గురువారం డిబార్ చేసినట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. వీరిలో నిజామాబాద్ లో ముగ్గురు, వికారాబాద్ లో ఒకరు, సంగారెడ్డిలో ఐదుగురు, సిద్దిపేటలో ముగ్గురు ఉన్నారు. గురువారం నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2 పరీక్షలకు 3,91,242 మంది హాజరయ్యారు. 20,541 మంది హాజరు కాలేదు..