Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 May 2022, 10:42 pm Posted by : Anjaneyulu Dega

భారత్ లో 6జీ సేవలు: ప్రధాని మోదీ

డిల్లీ: ఈ దశాబ్దం చివరి నాటికి భారత్ లో 6జీ టెలికాం నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం ఆన్లైన్ వేదికగా ఢిల్లీలోని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) రజతోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్ లో త్వరలో 5జీ సేవలను ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో మరో 450 బిలియన్ డాలర్లు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. 5జీ తో ఇంటర్నెట్ వేగంతో పాటు అభివృద్ధి వేగం కూడా పెరుగుతుందని మోదీ అన్నారు. గత యూపీఏ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు. చేశారు. 2జీ యుగం విధానపర లోపాలు, అవినీతికి ప్రతీకగా నిలిచిందని అన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో దేశం పారదర్శకంగా 4జీ సేవల దిశగా మళ్లిందని, ఇప్పుడు 5జీకి వెళ్తాందని తెలిపారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కేంద్రంగా ఉందని ప్రధాని అన్నారు. దేశీయంగా రూపొందించిన ‘5G టెస్ట్ బెడ్’ ను ప్రధాని ప్రారంభించారు. రూ. 220 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ స్థానిక పరిశ్రమలు స్టార్టప్లకు తోడ్పాటును అందిస్తుంది.