Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 May 2022, 10:13 am Posted by : Anjaneyulu Dega

గంగూలీ ఇంటికి వెళ్లిన అమిత్ షా..!

భాజపాలో దాదా చేరికపై మళ్లీ ఊహాగానాలు..

కోల్కతా: పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం మాజీ క్రికెటర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కలిశారు. దక్షిణ కోల్కతాలోని గంగూలీ నివాసానికి వెళ్లిన షా.. ఆయనతో కలిసి భోజనం చేశారు. వారిద్దరూ కలుసుకోవడంతో రాజకీయంగా పలు ఊహాగానాలకు తెరలేచినట్లయింది. గంగూలీ భాజపాలో చేరాలనుకుంటున్నారని, పార్టీలో కీలక పదవిని ఆశిస్తున్నారని వార్తలొస్తున్నాయి. కమలదళం తరపున బెంగాల్ సీఎం అభ్యర్థిగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు కూడా పలువురు చెబుతున్నారు. అయితే అలాంటి ఊహాగానాలను తాను పట్టించుకోబోనని గంగూలీ చెప్పారు. షాతో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని, అందుకే ఆయన తమ ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. గంగూలీ భాజపాలో చేరబోతున్నారంటూ గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.