Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 May 2022, 7:44 pm Posted by : anjudega

కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఉస్మానియా వర్సిటీకి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు.

“మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంత రాజ్యంలో ఉన్నామా? కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీల భిక్ష. కేసీఆర్ ఒక పిరికి పాలకుడు… ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉంది. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనను అనుమతి నిరాకరణపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తే వాళ్లను అరెస్టు చేయడం దారుణం. వారిని కలిసేందుకు వెళితే ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేస్తారా? వెంటనే అందరినీ విడుదల చేయాలి. రాహుల్ గాంధీ పర్యటనకు అందరూ సహకరించాలి” అని రేవంత్ రెడ్డీ కోరారు.

రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఆయన కార్యక్రమాల ఇన్ఛార్జి బైజు హైదరాబాద్ వచ్చారు. వరంగల్, హైదరాబాద్ లో ప్రొటోకాల్ అధికారులు పరిశీలించారు. ఈనెల 7న రాహుల్ గాంధీ భవన్ కు రానున్నారు. గాంధీభవన్ తో పాటు పరిసరాలను వ్యక్తిగత సిబ్బంది పరిశీలించారు. గాంధీభవన్ లోకి రాహుల్ ఎంట్రీ, సమావేశం జరిగే ప్రదేశాలను పరిశీలించారు. రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరణతో ప్రత్యామ్నాయం పై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు.