Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 April 2022, 2:09 pm Posted by : Anjaneyulu Dega

నిధులు ఇవ్వకుండా కేంద్రం శీతకన్ను: కేటీఆర్

హైదరాబాద్: విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వివిధ పథకాలపై రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం శీతకన్ను వేస్తోందని విమర్శించారు. తెలంగాణ శాసనసభ కమిటీ హాల్లో వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. స్థాయీ సంఘం ఛైర్మన్, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ కు సహా తెలుగు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పట్ల కేంద్రం తీరును వివరించారు..
“కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్డీసీ, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదు. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంస్ఎంఈలకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలి. సాంకేతిక, సాఫ్ట్ వేర్ రంగంలోని మార్పులు దేశం అందిపుచ్చుకోవాలి. ఈ- కామర్స్ పై జాతీయ విధానాన్ని సత్వరం తీసుకురావాలి. ఈ కామర్స్ పై ముడిపడిన ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ పేమెంట్స్ వంటి అంశాలపై విధానాలు ప్రకటించాలి. సిటిజన్ సర్వీస్ డెలివరీ పట్ల కేంద్రం చురుగ్గా కదలాలి. ఈ- కామర్స్ రంగాల ద్వారా భారీగా ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఈ రంగంలో పురోగతి దృష్ట్యా డిజిటల్ లిటరసీపై దృష్టి సారించాలి. సైబర్ నేరాల కట్టడికి నల్సార్ వర్సిటీతో చట్టరూపకల్పన ప్రయత్నం చేయాలి” అని కేటీఆర్ అన్నారు..