Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 April 2022, 8:35 am Posted by : Anjaneyulu Dega

భక్తులకు తితిదే విజ్ఞప్తి…!

రద్దీ చూసుకుని తిరుమలకు రండి

తిరుమల: టికెట్లు లేకుండా నేరుగా తిరుమలకు వచ్చిన భక్తులకు బుధవారం నుంచి దర్శనానికి అనుమతించనున్నట్టు తితిదే అధికారులు తెలిపారు. మరో వైపు టికెట్లు లేకుండా వస్తున్న భక్తులతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం-2లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. దీంతో వైకుంఠం-2 వెలుపల క్యూలైన్లలో భక్తులు పెద్ద సఖ్యలో బారులు తీరారు. దర్శనం టికెట్లు ఉన్న వారిని మాత్రమే తితిదే సిబ్బంది క్యూలైన్లలోకి పంపిస్తున్నారు. మరో వైపు అలిపిరి నడకమార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. టిక్కెట్లు లేకుండా నేరుగా వచ్చిన భక్తులను రేపట్నుంచి దర్శనానికి అనుమతించనున్నట్టు తితిదే అదనను ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ వల్ల సర్వదర్శనం స్లాట్ విధానం రద్దు చేసినట్టు చెప్పారు. వైకుంఠంలో వేచి ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రద్దీ వల్ల శ్రీవారి దర్శనం కోసం 20 నుంచి 30 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు రద్దీ చూసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. వైకుంఠం-2లోని క్యూలైన్లు తనిఖీ చేసి, భక్తులకు అందుతున్న వసతులను ధర్మారెడ్డి పరిశీలించారు..