Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 06 April 2022, 10:32 am Posted by : Anjaneyulu Dega

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఇకపై పీహెచ్సీలోను ఆరోగ్యశ్రీ..

పాము, కుక్క కాటు మందులు లేకుంటే చర్యలు: వైద్యారోగ్య శాఖ మంత్రి

తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయికి విస్తరింపజేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్సీలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఎన్రోల్ చేసుకోవాలని అధికారులకు సూచించారు. పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. మంగళవారం మంత్రి హరీష్ రావు పీహెచ్సీల పనితీరుపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలు పెంచాలనే లక్ష్యంలో భాగంగా వైద్యులకు, నర్సులకు ఇన్సెంటివ్స్ ఇస్తామని తెలిపారు. పీహెచ్సీల్లో అవసరమైన అన్ని రకాల మందులతో పాటు పాము, కుక్క కాటు మందులు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. మందులు లేవనే పరిస్థితి ఉండొద్దని, మందుల కోసం బయటికి రాస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాలని స్పష్టం చేశారు. 24 గంటల పీహెచ్సీలు అత్యవసర సేవలను అన్నివేళల్లోనూ అందించాలని ఆదేశించారు..