Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 April 2022, 5:17 pm Posted by : Anjaneyulu Dega

జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా: ప్రజా శాంతికి భంగం కలగకుండా, జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగించడానికి ఈ నెల 30 వరకు 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. జిల్లాలో ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలన్నా ముందస్తుగా డిఎస్పి, లేదా ఆపై అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, జెండ కర్రలు, దుడ్డు కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసిగొల్పే ఎటువంటి ఆయుధాలు, సామాగ్రి కలిగి ఉండొద్దని పేర్కొన్నారు. జనజీవనానికి ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు, జనసమూహం లాంటివి పూర్తిగా నిషేధం అన్నారు. ప్రచార రథాలు, మైకులు, అధిక శబ్ద పరికరాలు పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులవుతారని సూచించారు. శాంతి పూర్వకంగా ఏలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా వివరాలు వెల్లడించి అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, కేంద్ర రక్షణ దళాలు, విధి నిర్వహణలోని హోంగార్డులు, ప్రభుత్వ సెక్యూరిటీ గార్డులు, ప్రార్థనా స్థలాలు, అంత్య క్రియల ఊరేగింపులకు నిబంధనల నుండి మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం దృష్ట్యా, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్ స్పెషల్ బ్రాంచ్ నిఘా అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు ప్రతి మండల కేంద్రంలో నిఘా కొనసాగిస్తూ ఆకస్మిక దాడులు చేపట్టి, అక్రమార్కులపై గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు..