Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 March 2022, 9:39 am Posted by : Anjaneyulu Dega

విషం ఇంజక్షన్లతో వందకు పైగా కుక్కల మృతి..?

సిద్దిపేట జిల్లా తీగుల్ గ్రామంలో ఘటన..

సర్పంచి, కార్యదర్శి చేయించారని స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు..

సిద్దిపేట జిల్లా: మూగజీవాల పట్ల విశ్వాస ఘాతుకమిది. విషం ఇంజక్షన్లు ఇవ్వడంతో వందకు పైగా కుక్కలు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుడొకరు తన పెంపుడు కుక్క చనిపోవడంతో హైదరాబాద్ లోని స్టే యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. సంస్థ సభ్యులు ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చి విచారించగా అసలు విషయం వెల్లడైంది. సంస్థ ప్రతినిధులు శశికళ, గౌతం పలు వివరాలను విలేకరులకు వెల్లడించారు. కుక్కల బెడదపై గ్రామస్థులు పలుమార్లు పంచాయతీకి ఫిర్యాదులు చేయడంతో సర్పంచి కప్పర భానుప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి రాజ్ పాల్ ఇద్దరూ కలసి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇప్పించారన్నారు. విషం వల్ల వందకు పైగా శునకాలు చనిపోయాయని, వాటి కళేబరాలను గ్రామ పరిసరాల్లోని పాత బావుల్లో వేసి పూడ్చేశారని తెలిపారు. ఈ విషయంపై జగదేవపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు స్పందించలేదన్నారు. దీన్ని వారు జాతీయ జంతు సంరక్షణ సంస్థ ప్రతినిధి మేనకాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తీగుల్లో కుక్కలకు విషం ఇంజక్షన్లు ఇచ్చి చంపినట్లు ఫిర్యాదు రాగా సర్పంచి, కార్యదర్శి పై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు..